Mobile AppDownload and get updated news
ఢిల్లీలోని జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ యూనిటీ ప్యానెల్ ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల కూటమి అయిన లెఫ్ట్ యూనిటీ.. ప్యానెల్లోని నాలుగు పోస్టుల్లో మూడింటిని దక్కించునే దిశగా అడుగులేస్తోంది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. గత రెండేళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ, బీఏపీఎస్ఏ (బిర్సా అంబేద్కర్ పూలే స్టూడెంట్స్ అసోసియేషన్) అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోరులో లెఫ్ట్ యూనిటీ అభ్యర్థి 427 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఏబీవీపీకి చెందిన జాహ్నవి 113 ఓట్లు, బీఏఎస్పీకి చెందిన రాహుల్ 279 ఓట్లు సాధించారు. వైస్ ప్రెసిడెంట్ పోస్టు రేసులో లెఫ్ట్ యూనిటీ అభ్యర్థి అమల్ తన సమీప ప్రత్యర్థిపై 300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. జాయింట్ సెక్రటరీ పోస్టు విషయంలో మాత్రమే లెఫ్ట్ యూనిటీకి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఫిబ్రవరి 9 నాటి సంఘటన యూనివర్సిటీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే కారణంతో ప్రస్తుత ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ సహా మిగతా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై దేశద్రోహ నేరం మోపిన పోలీసులు అనంతరం బెయిల్పై విడుదల చేశారు.