గుజరాత్ లోని కాక్రాపార్ అణుశక్తి కేంద్రం (కెఎపిఎస్)లో లీకేజీ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్రాన్ని అత్యవసర ప్రాతిపదికన మూసివేయాల్సి వచ్చింది. ఆ కేంద్రంలోని ఒకటో యూనిట్లోని ప్రాథమిక ఉష్ణ సరఫరా విభాగంలో లీకేజీని అణుశక్తి కేంద్ర వర్గాలు శుక్రవారం గమనించాయి. అయితే, ఈ లీకేజీ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కేవలం నీరు మాత్రమే లీక్ అవుతుందని, ఎటువంటి అణు పదార్థాలు విడుదల కావడం లేదని ప్రజలు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అణుకేంద్రంలోని సిబ్బంది కూడా రేడియేషన్ ప్రమాదానికి లోనుకాలేదని దేశంలో అణు భద్రత అంశాలను పర్యవేక్షించే బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) అసోసియేట్ డైరెక్టర్ కె.ఎస్.ప్రదీప్ కుమార్ తెలిపారు.
Mobile AppDownload and get updated news