ఆ ప్రభుత్వాధికారి సుపుత్రుడి నిర్వాకం రెండు అమాయక పేపర్బోయ్ల నిండు ప్రాణాలు హరీ అనేలా చేసింది. థానే నగరంలో రామ్జీ అనే వ్యక్తి తన మేనల్లుడితో కలిసి పేపర్బాయ్ గా చేస్తూ పొట్టపోసుకుంటుంటాడు. ప్రతీ రోజు తెల్లవారుజామున వారిద్దరూ తమ స్కూటరుపై తిరుగుతూ దినపత్రికలను ఇంటింటికి తిరిగి అందచేస్తుంటారు. మంగళవారం తెల్లవారు జామున వారిద్దరూ ఎప్పటిలాగే దినపత్రికలు వేసే పనిలో ఉండగా కనీసం ఊహించను కూడా ఊహించని రీతిలో ఒక కారు వచ్చి వారిని గుద్దేసింది. ఈ ఘటనలో వారు కనీసం పక్కకు తొలగి తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో కారు కింద పడి నుజ్జునుజ్జు అయిపోయారు. ఆ కారు స్థానిక థానే మునిసిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఇంజనీర్ గారిది. దాన్ని తోలుతోంది మాత్రం ఆయనగారి పుత్ర రత్నం. రోడ్డు సేఫ్టీ గురించి జనాలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ ప్రభుత్వాధికారి, తన సుపుత్రుడికి అడగకుండానే కారు కొనిచ్చి ఎంజాయ్ చేస్కో పో అని ఆఫరిచ్చేయడంతో అతగాడికి కోతికి కొబ్బరికాయ దొరికినట్లయ్యింది. అర్థరాత్రి, అపరాత్రి తేడాలేకుండా షికార్లు కొట్టినా ఆ తండ్రి అడగలేదు. అతగాడి కారు ఆ ఇద్దరు పేపర్ బాయ్స్ ప్రాణాలను తీసేసుకున్న రోజు, అసలు అంత తెల్లవారు జామున అతగాడు ఎక్కడికి వెళ్తున్నాడు.. అంతవేగంగా కారును నడపాల్సిన అవసరం ఆ ఇంజినీరు తనయుడికి ఎందుకొచ్చిందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిద్దరిపైనే వారి కుటుంబాల జీవితం ఆధారపడి ఉంది. ఇప్పుడు వారి మరణంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారిలో అత్యధికులు ప్రభుత్వాధికారులు, పోలీసుల తనయులే కావడం గమనార్హం. రోడ్డు భద్రత గురించి జనాలకు పాఠాలు చెప్పే సదరు అధికారులు, తమకు మాత్రం వేరే రూల్ అనుకుంటూ ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Mobile AppDownload and get updated news