Mobile AppDownload and get updated news
తల్లికి కావాల్సింది... కొడుకులిచ్చే బహుమతులు, ఆభరణాలు, ఆడంబరాలు కాదు... తన కన్నబిడ్డలు సంతోషంగా, సురక్షితంగా ఉన్నారన్న భావన. తల్లిని ప్రేమించే ప్రతి బిడ్డ కోరుకునేది వారసత్వంగా వచ్చే ఆస్తిని కాదు... తల్లి ప్రేమని. అలాంటి తల్లీకొడుకులు కోల్కతా మహానగరంలో తప్పిపోయారు. మళ్లీ మదర్స్ డే రోజు కలుసుకున్నారు. 62 ఏళ్ల తాండ్ర నారాయణన్ కొడుకుతో సహా కలిసి కేరళలోని కర్నాకులం నుంచి కోల్కతా వచ్చింది. శనివారం రైల్వేస్టేషన్లో తల్లీకొడుకులిద్దరూ దిగారు. రైలు దిగేప్పుడు ఎక్కే జనం, దిగే జనం ఎక్కువైపోయి... తల్లీకొడుకులిద్దరూ విడిపోయారు. కొడుకు తల్లిని వెతుక్కుంటూ వెళితే, తల్లి కొడుకు కోసం చూడసాగింది. రైల్వే పోలీసులు తల్లి దగ్గరికి వచ్చి వివరాలు అడిగారు. ఆ భాష అర్థం కాక భోరుమంది ఆ పిచ్చితల్లి. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆమె భాష అర్థం కాలేదు. అప్పుడు మళయాళం తెలిసిన ఓ లారీ డ్రైవర్ను వెతికి తెచ్చారు పోలీసులు. అతను ఆమెతో మాట్లాడి వివరాలు చెప్పాడు. ఆమె ఫోటోతో సహా అన్ని పోలీస్ స్టేషన్లకు వివరాలు పంపించారు రైల్వే పోలీసులు. ఈలోపే ఆమె కొడుకు కూడా తల్లి తప్పిపోయినట్టు ఫిర్యాదు చేశాడు. చివరికి పోలీసులకు ఇద్దరి మిస్సింగ్ రిపోర్లులు సరిచూసుకుని కొడుక్కి కబురుపెట్టారు. సరిగ్గా మదర్స్ డే రోజు ఉదయాన తల్లీకొడుకులిద్దరూ కలుసుకున్నారు. వెంటనే ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆనందభాష్పాలు కార్చారు. ఓ పోలీసు మాట్లాడుతూ 'వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు కానీ... ప్రేమకి భాషతో పనిలేదు... వారి భావాలు మాకర్థమయ్యాయి' అన్నాడు.