Mobile AppDownload and get updated news
హైదరాబాదులో కల్తీ రక్తం కలకలం సృష్టించింది. కోఠీలోని ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే నరేంద్ర అనే యువకుడు ఈ కల్తీ రక్తం సృష్టికర్త. రెండేళ్ల నుండి నరేంద్ర కాంట్రాక్టు ఉద్యోగిగా అక్కడ పనిచేస్తున్నాడు. సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లోని రక్త నిధుల్లో అత్యవసర సమయంలో ఉపయోగపడేలా వైద్య ఆరోగ్య శాఖే ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది. కానీ, ఆ బ్లడ్ బ్యాంకుల్లో ఏనాడూ అత్యవసరవేళల్లో రక్తం అందుబాటులో ఉండే సందర్భాలు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నరేంద్ర రక్తం కొరతను తన అక్రమార్జనకు మార్గంగా మార్చుకున్నాడు. బయటి నుండి రక్తం సమకూర్చుతానంటూ రోగుల బంధువుల నుండి డబ్బు వసూలు చేస్తాడు. బయటి బ్లడ్ బ్యాంకుల నుండి రక్తం తీసుకువచ్చి ఆ రక్తం బ్యాగుల్లోని రక్తాన్ని సిరంజి ద్వారా బయటకు లాగి ఇంకొక బ్యాగులో నింపేవాడు. అనంతరం ఆ బ్యాగుల్లోని సగం మిగిలిన రక్తానికి సిలైన్ నీటిని కల్తీచేసేవాడు. గురువారం నాడు అనుకోకుండా ఈ విషయం బయటకు పొక్కడంతో వైద్యవర్గాలు అవాక్కయ్యాయి. రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం నరేంద్ర పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. దాదాపు సంవత్సరం నుండి ఈ తంతు నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా రోగికి రక్తాన్ని ఎక్కించేముందు దానికి సవాలక్ష పరీక్షలను నిర్వహిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా రోగి ప్రాణాలకే ముప్పువాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర లాంటి వ్యక్తుల స్వార్థం కారణంగా రోగుల ప్రాణాలకు ఆపదవాటిల్లుతుండటం పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.