Mobile AppDownload and get updated news
ప్రపంచంలో అత్యధిక కాలం ఎటువంటి అనారోగ్యాలను దరిచేరనీయకుండా నిక్షేపంగా జీవించిన 116 ఏళ్ల అమెరికా బామ్మ గురువారం నాడు కన్నుమూసింది. జూలై 7వ తేదీ 1899వ సంవత్సరంలో అలబామాలో జన్మించిన సుసన్నా ముషాత్ జోన్స్ చిన్నపిల్లల సంరక్షకురాలిగా తన జీవితకాలాన్ని గడిపింది. తనతోపాటు పుట్టినవారంతా 70, 80 ఏళ్లకే గుటుక్కుమన్నా మిస్ సుసీ (ముషాత్ జోన్స్ ముద్దుపేరు) మాత్రం రాయిలా చక్కని ఆరోగ్యంతో కులాసాగా ఉండేది. గత ఏడాది ఆమె పుట్టిన రోజును ఆమె కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వార్తలకెక్కింది. మీరు ఇంతకాలం ఎలా జీవించగలిగారు.. అదీనూ ఇంత చక్కని ఆరోగ్యంతో అని అడిగితే.. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, మద్యం జోలికి పోనని, ధూమపానం అంటే అస్సలు గిట్టదని చెప్పింది. సమయానికి నిద్రకుపక్రమించడం, వేళకు లేవడం తన ఆరోగ్య రహస్యమంది. ఆమె తన జీవిత కాలంలో మూడు శతాబ్దాలను చూసింది. రెండు ప్రపంచ యుద్ధాలు, 20మంది అమెరికా అధ్యక్షుల పాలనను కూడా చవిచూసింది. కాగా, ముషాత్ జోన్స్ మరణంతో ఆమె స్థానం ఇటలీకి చెందిన ఎమ్మా మొరానో మార్టిన్జ్ కు సంక్రమించింది. మొరానో వయసు కూడా ప్రస్తుతం 116ఏళ్లు.