ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తొలి మ్యాచ్లో ఆకట్టుకుంది. జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్ను టీమిండియా 3-3తో 'డ్రా' చేసుకుంది. భారత్ తరఫున రఘునాథ్ , మన్దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జర్మనీ జట్టుకు టామ్ గ్రామ్బుష్ రెండు గోల్స్, జొనాస్ గోమోల్ ఒక గోల్ అందించారు. ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను రఘునాథ్ సద్వినియోగం చేసుకోవడంతో భారత్ ఖాతా తెరిచింది. 26వ నిమిషంలో జర్మనీ స్కోరు సమం చేసినా...ఆ వెంటనే భారత్ మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్ ఆరంభంలో హర్మన్ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్తో భారత్కు మూడో గోల్ను అందించాడు. ఈ దశలో జర్మనీ దూకుడును పెంచి భారత గోల్పోస్ట్పై దాడులు చేసి రెండో గోల్ను సాధించింది. తర్వాత కాసేపు జర్మనీ జోరును భారత్ అడ్డుకున్నా... చివర్లో తడబడింది. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను జర్మనీ సద్వినియోగం చేసుకొని స్కోరును సమం చేసింది. చివరి 3 నిమిషాల్లో భారత్ మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భారత, బ్రిటన్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది.
Mobile AppDownload and get updated news